
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (Twitter) వేదికగా ఈ విధంగా రాసుకొచ్చారు. అందులో.. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కేవలం యాత్రా స్థలం మాత్రమే కాదని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హిందువుల భక్తి, విశ్వాసాలకు ప్రతీక అని అభివర్ణించారు. అలానే తిరుమల లడ్డూ కేవలం తీపి పదార్థం కాదని, భక్తుల సమిష్టి భావోద్వేగం అని పవన్ అన్నారు. ప్రతి భక్తుడు లడ్డూని తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవడం దైవానుగ్రహం పంచుకున్నట్లేనని చెప్పారు.
మరోవైపు సెక్యులరిజం అనేది ఒకపక్కకు మాత్రమే పరిమితం కాకూడదని అన్నారు. అన్ని మతాలనూ, విశ్వాసాలనూ సమానంగా గౌరవించడమే నిజమైన లౌకికత అని ఆయన స్పష్టం చేశారు. ఒక మతంపై వ్యాఖ్యలు చేస్తూ మరొక మతాన్ని కించపరచడం సెక్యులరిజం కాదని.. ఇలాంటి ధోరణులు సమాజంలో విభజనకు దారి తీస్తాయని హెచ్చరించారు. ఇక ప్రతి సంవత్సరం సగటున 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలను సందర్శించి.. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం పొందుతున్నారని పవన్ గుర్తు చేశారు.
ట్వీట్లో, సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. ఈ బోర్డు హిందూ ఆలయాలు, ఆచారాలు, భక్తుల విశ్వాసాల పరిరక్షణ కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇది ఏ ఒక్క వర్గం నిర్ణయం కాదని.. అన్ని మతాల, అన్ని వర్గాల, అన్ని భాగస్వాముల ఏకాభిప్రాయంతో ఈ బోర్డు ఏర్పాటవ్వాలి. మన సనాతన సంప్రదాయాలు తరతరాలకు కొనసాగాలని మనందరం కృషి చేయాలని పవన్ కళ్యాణ్ అన్నారు
