ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక పురోగతి.. కారు బాంబు తయారు చేసిన నిందితుడి అరెస్ట్


కారు బాంబు తయారు చేసిన జసీర్ బిలాల్ వాని అరెస్ట్

అనంతనాగ్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ

ఆత్మాహుతి బాంబర్‌కు బాంబు ఇచ్చింది ఇతడేనని వెల్లడి

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరో కీలక పురోగతి సాధించింది. ఈ కేసుకు సంబంధించి కారు బాంబును తయారు చేసిన కీలక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. అనంతనాగ్‌లో జసీర్ బిలాల్ వాని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు.

ఆత్మాహుతి బాంబర్ ఉమర్‌కు కారు బాంబును అందించింది బిలాలేనని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, డ్రోన్లు, రాకెట్ల ద్వారా కూడా దాడులకు జసీర్ బిలాల్ కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. ఇదే కేసులో ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నిన అమీర్ రషీద్ అలీని ఆదివారం ఎన్‌ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పేలుడుకు ఉపయోగించిన కారు అమీర్ పేరు మీదే రిజిస్టర్ అయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

నవంబర్ 10న జరిగిన ఈ పేలుడు ఘటనపై ఎన్‌ఐఏ లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. పేలుడు కుట్రలో పాల్గొన్న వ్యక్తులు, సంస్థలను గుర్తించే పనిలో ఉంది. ఈ కేసులో ఇప్పటివరకు 73 మంది సాక్షులను విచారించారు. ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ పోలీసుల సహకారంతో దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!